సింహం సింగిల్‌గానే వస్తుంది, పార్టీ పేరు జూలై 8న చెపుతా: వైఎస్ షర్మిల

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (23:50 IST)
కెసిఆర్ ప్రభుత్వం అన్యాయాలను ప్రశ్నించడానికి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ప్రారంభించడం చాలా అవసరం అని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిల అన్నారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం 'సంకల్పసభ'లో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆమె తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
 
నిరుద్యోగ యువత కోసం ప్రకటించిన ఉద్యోగాలు ఎక్కడ అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఆమె ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చాలా నష్టపోయారు. నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
 
రాష్ట్రంలో కెజి నుండి పిజి ఉచిత విద్య ఎక్కడ ఉంది? ఆశ్రయం లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి? అర్హత ఉన్నవారికి రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయి?" రైతుల ఆత్మహత్యలకు సంబంధించి దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని ఆమె గుర్తించారు. వైయస్ఆర్- కెసిఆర్‌ల మధ్య చాలా తేడాలు ఉన్నాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఫ్రీ కరెంట్ వంటి వైయస్ఆర్ పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అందించలేదని షర్మిలా అభిప్రాయపడ్డారు.
వైయస్ఆర్ పాలన కాలం బంగారు కాలం అని ఆమె పేర్కొన్నారు. వైయస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8న పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రాజన్న పాలనను పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తనకు తమ మద్దతును అందించినందుకు, సంకల్పసభను గొప్ప విజయవంతం చేసినందుకు ఖమ్మం ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. సింహం సింగిల్ గా వస్తుందనీ, తను ఏ పార్టీ పిలిస్తేనో, ఏ పార్టీకి మద్దతుగానో పార్టీని పెట్టడంలేదనీ, తెలంగాణ ప్రజల కోసం పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు.
 
ఇదే రోజు వైయస్ఆర్ యొక్క ప్రస్థానం ప్రారంభమైన ఏప్రిల్ 9 గొప్ప రోజనీ, రాజకీయాల్లో ప్రవేశిస్తున్న తన కుమార్తె షర్మిలాను ఆశీర్వదించాలని ఆమె తల్లి వైయస్ విజయమ్మ ప్రతి ఒక్కరినీ కోరారు. ఖమ్మం ప్రజలు ఎల్లప్పుడూ వైయస్ఆర్ కుటుంబానికి మద్దతు ఇస్తున్నారని, 2014 ఎన్నికలలో వైయస్ఆర్ పార్టీకి ఓటు వేశారని గుర్తుచేస్తూ, షర్మిలకు కూడా అదే మద్దతు ఇవ్వమని ఆమె కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు