మాస్కులను కుడుతున్న కేంద్ర మంత్రి భార్య - కుమార్తె

బుధవారం, 8 ఏప్రియల్ 2020 (12:30 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది. ఇటీవల చైనా నుంచి మాస్కోకు మాస్కులతో వెళ్లిన ఓ ఫ్లైట్‌ను అమెరికా హైజాక్ చేసిందన్న వార్త కలకలం రేగింది. దీన్నిబట్టి చూస్తే ప్రపంచంలో మాస్కుల కొరత ఏ విధంగా ఇట్టే గ్రహించవచ్చు. అలాంటి పరిస్థితే మన దేశంలోనూ నెలకొనివుంది. 
 
కరోనా వైరస్ వ్యాపించకముందు దేశంలో ఒక మాస్కు ధర రెండు నుంచి ఐదు రూపాయల వరకు ఉండేది. ఇపుడు ఏకంగా 20 రూపాయల నుంచి 50 రూపాయలకు పైగా పలుకుతోంది. దీనికి కారణం కరోనా స్వీయ నియంత్రణ చర్యల్లో భాగంగా భిక్షగాడు మొదలుకుని ధనవంతుడు వరకు మాస్కులు ధరిస్తున్నాడు. ఫలితంగా దేశంలో మాస్కుల కొరత ఏర్పడింది. అంతేకాకుండా, కరోనాపై సాగుతున్న పోరాటంలో భాగంగా, ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భార్య మృదుల, కుమార్తె నైమిషాలు కరోనా కట్టడి చర్యల్లో భాగస్వాములయ్యారు. తమ కుటుంబ సభ్యులకు స్వయంగా మృదుల, నైమిషా మాస్కులను తయారు చేశారు. అవసరమున్న వారికి కూడా మాస్కులను తయారు అందజేస్తామన్నారు. 
 
భార్య మృదుల, కుమార్తె నైమిషా కలిసి మాస్కులను స్టిచ్‌ చేస్తున్న ఫోటోలను కేంద్ర మంత్రి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేసేందుకు ప్రయత్నించాలి. తన భార్య, కుమార్తె మాస్కులను తయారు చేయడం తనకు గర్వంగా ఉంది అని ధర్మేంద్ర ప్రదాన్‌ ట్వీట్‌ చేశారు. 
 
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారికి ఇంట్లో తయారు చేసే మాస్కులు ఉపయోగపడుతాయని ఆయన పేర్కొన్నారు. నివాసం నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కును ధరించడం మంచిది, అది ఆరోగ్యానికి ఎంతో సురక్షితమని కేంద్ర మంత్రి ప్రధాన్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు