ప్రియుడి కోసం భర్తను లారీతో ఢీకొట్టించి చంపేసిన భార్య

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:30 IST)
ఓ కసాయి భార్య తన ప్రియుడుతో సుఖంగా ఉండటం కోసం కట్టుకున్న భర్తను లారీతో ఢీకొట్టించి చంపేసింది. ఈ దారుణం చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని పెద్దమండ్యం మండలం, చెరువుముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం (35) అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రిత నీరుగట్టువారి పల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా మదనపల్లెలోని కదిరి రోడ్డులో నివసిస్తూ ఓ షాపును పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 
 
అయితే, తమ వ్యాపారంలో నష్టాలు రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతి వెళ్లి ఓ ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు. రేణుక మాత్రం మదనపల్లెలో పిల్లలను పెట్టుకుని ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఓ పార్టీకి చెందిన సేవాదళ్ కార్యకర్త కె.నాగిరెడ్డితో రేణుకకు పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో ఇటీవల తిరిగి మదనపల్లెకు వచ్చిన బాలసుబ్రహ్మణ్యం తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి మందలించాడు. ఇదే విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్తను వదిలించుకోవాలని భావించిన రేణుక ఇదే విషయాన్ని ప్రియుడు నాగిరెడ్డికి చెప్పి భర్త హత్యకు ప్లాన్ చేసింది. 
 
శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు చేయడంతో, వెళ్లి మందులు తెచ్చుకోమంటూ రాత్రి 11 గంటల సమయంలో ఒత్తిడి చేసింది దీంతో అతను మందుల కోసం బయటకు వెళ్లగా ఈ విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. అప్పటికే సమయం కోసం వేచి చూస్తున్న నాగిరెడ్డి మందులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా లారీతో ఢీకొట్టి హత్య చేశాడు. 
 
దీనిపై మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు