ఒక సినిమాను చూసి భయపడేంత వీక్‌గా గవర్నమెంట్ వుందా?

శనివారం, 10 నవంబరు 2018 (14:16 IST)
దళపతి విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ''సర్కార్'' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పొలిటికల్ డ్రామా విడుదలైన తర్వాతి రోజు నుంచి తమిళనాడులో తీవ్ర దుమారం మొదలైంది. ఈ సినిమాలో తమిళనాడు రాజకీయాల పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. 
 
ఈ క్రమంలో అన్నాడీఎంకే కార్యకర్తలు సర్కార్ సినిమా ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లపై దాడి చేశారు. పోస్టర్లను, బ్యానర్లను చించేశారు. కొన్నిచోట్ల షోలను రద్దు చేశారు. దీంతో ''సర్కార్'' టీమ్ వెనక్కి తగ్గింది. కొన్ని సన్నివేశాలను మ్యూట్ చేస్తున్నట్లు, అలానే అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తున్నట్లు సర్కార్ టీమ్ అనౌన్స్ చేసింది. దీంతో సర్కార్ గొడవ సద్దుమణిగింది. 
 
ఈ నేపథ్యంలో సినిమాలో విలన్ పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రభుత్వతీరుపై ఘాటుగా స్పందించింది. ''ఒక సినిమాను చూసి భయపడేంత వీక్‌గా గవర్నమెంట్ ఉందా..? అని సెటైర్లు విసిరింది. మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తూ మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు.. అంటూ వరలక్ష్మీ మండిపడింది. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయడం మానుకోండి. క్రియేటివిటీ స్వేచ్చను హరించకండి'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. మరి వరలక్ష్మి వ్యాఖ్యలపట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు