గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కథ ఎలా ముగిసిందంటే... వివరించిన పోలీస్ అధికారి...

శుక్రవారం, 10 జులై 2020 (10:03 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కథ ముగిసిపోయింది. ఎక్కడైతే తన సత్తా చాటాడో అదే ప్రదేశంలో పోలీసులు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అదీకూడ కాన్పూర్‌ నగర శివారు ప్రాంతాల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 
 
ఈ ఎన్‌కౌంటర్ గురంచి ఘటనా స్థలిలో అసలు ఏం జరిగిందన్న అంశంపై ఓ పోలీస్ అధికారి స్వయంగా వెల్లడించారు. గురువారం సాయంత్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో వికాస్ దూబేను అరెస్టు చేసింది, అదే రోజు సాయంత్రం ఉజ్జయిని నుంచి యూపీలోని కాన్పూర్‌కు పోలీసులు బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ మారు కొద్దిసేపు ఆగినట్టు పోలీసులు తెలిపారు. 
 
అయితే, వికాస్ దూబేను కాన్పూర్‌కు తీసుకుని వస్తున్నారని అతని అనుచరులకు తెలిసిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన సదరు అధికారి, కాన్పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోకి తమ కాన్వాయ్ రాగానే, కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడించాయన్నారు. 
 
అపై కాన్పూర్ శివార్లలోకి వాహనం రాగానే, డ్రైవర్ వెనుక ఉన్న వికాస్ దూబే, తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ నుంచి పిస్టల్‌ను లాక్కున్నాడు. డ్రైవర్ తో పెనుగులాడగా, వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వెంటనే వాహనాన్ని దిగిన దూబే, పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పరిగెత్తాడు. 
 
వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించినట్టు ఆ అధికారి వివరించారు. 
 
ఇదే విషయాన్ని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ కూడా స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనలో వికాస్ దూబే హతుడయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు తదుపరి దశలో వెల్లడిస్తామని అన్నారు. 
 
కాన్పూరులో భారీ వర్షం కురుస్తోందని, ఆ కారణంగా పరిస్థితులను తనకు అనువుగా మార్చుకుని తప్పించుకోవాలని దూబే చూశాడని, కానిస్టేబుల్ నుంచి పిస్టల్‌ను లాక్కుని పారిపోతుంటే, పోలీసులే అతన్ని కాల్చారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు