ఆర్టికల్ 370 ఎపుడో రద్దు చేయాల్సింది.. ఆనంద్ మహీంద్రా

మంగళవారం, 6 ఆగస్టు 2019 (11:33 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. ఇలాంటి మంచి నిర్ణయాలు ఎపుడో చేయాల్సిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'భారత ప్రజలంతా కాశ్మీరీలను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకోవాల్సిన సమయం ఇది. కొన్ని నిర్ణయాల గురించి తెలుసుకున్నపుడు.. ఇలాంటి నిర్ణయాలు ఇంతకుముందే తీసుకుని ఉంటే బాగుండేది. అసలు అలా ఎందుకు జరగలేదు అని అనిపిస్తుంది. ఈరోజు(సోమవారం) తీసుకున్న నిర్ణయం కూడా అలాంటి కోవకు చెందినదే. జాతీయ వర్గంలోకి చేరిన కాశ్మీరీలను ఏ మాత్రం సంకోచం లేకుండా.. పూర్తిగా మనవారు అయ్యారనే భావనతో ఆత్మీయంగా హత్తుకోవాల్సిన సమయం ఇది' అంటూ ట్వీట్ చేశారు. 
 
సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా... ఆర్టికల్ 370 రద్దుకు ముందు జరిగిన పరిణామాలపై కూడా తనదైనశైలిలో స్పందించారు. 'ఇది కేవలం మరో సోమవారపు ఉదయం మాత్రమే అనుకోవద్దు. కాశ్మీర్‌ కేంద్ర నిర్ణయంపై యావత్‌ దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కాశ్మీర్‌లో అందరూ సురక్షితంగా ఉండాలని.. దేశ పటిష్టత, భవిష్యత్‌ను ఇనుమడింపచేసే నిర్ణయం వెలువడాలని మనం ప్రార్ధించాలి' అని పేర్కొన్నారు. 
 
అయితే, ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా.. కాశ్మీర్‌ కూడా మనదే' అంటూ కొంతమంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా... ''స్టాండ్‌ విత్‌ కాశ్మీర్" అంటూ మరికొంత మంది బీజేపీ సర్కారు తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు