వాళ్లు చెప్పినట్లే.... మన మిగ్‌లు యుద్ధానికి పనికిరావా? ఇలా కూలిపోతున్నాయేంటి?

శుక్రవారం, 8 మార్చి 2019 (22:23 IST)
మొన్నామధ్య మనదేశంలో వున్న మిగ్ 21 విమానాలన్నీ పాతచింతకాయ పచ్చడిలాంటివనీ, యుద్ధంలో ఎందుకూ పనికిరానివంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పెద్ద కథనం వచ్చింది. ఆ కథనాన్ని నిజం చేసేలా మన మిగ్ విమానాలు వరుసబెట్టి కూలిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని బికనీర్‌లో ప్రమాదం జరిగింది. మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది.
 
ఈ యుద్ధ విమానం బికనీర్ సమీపంలోని నాల్ వద్ద కూలింది. ఐతే మిగ్‌లో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. గతవారం భారత్‌పై పాకిస్థాన్ దాడులకు దిగడంతో మిగ్ 21 బైసన్‌లో ప్రయాణించిన భారత్ పైలట్ సైతం యుద్ధ విమానంలో సాంకేతిక లోపం కారణంగా అది కూలడంతో పాకిస్థాన్ భూభాగంపై ల్యాండ్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు విదితమే. ఈ రోజు కూడా మిగ్ కూలిన ఘటన పట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఓ మిషన్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన మిగ్ 21 బైసన్‌ను పక్షి ఢీకొట్టినట్లు కొందరు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే పక్షి మిగ్‌ని ఢీకొని ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు. ఏమైనా కాలం చెల్లిన యుద్ధ విమానాలు భారత్‌కు తెల్ల ఏనుగులుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే భారతదేశ యుద్ధ సామగ్రి యుద్ధం వస్తే 10 రోజుల్లో ఖాళీ అయిపోతాయంటూ వార్తలు వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అటుంచితే మిగ్ విమానాలు వరసబెట్టి కూలిపోవడం ఇపుడు కలవరపెడుతున్న అంశం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు