వ్యవసాయ రుణాల మాఫీ మరియు ఉపశమనం పథకం కింద ఒక హెక్టారు వ్యవసాయ భూమి కలిగిన చిన్నకారు రైతులు, మరియు ఒకటి నుంచి రెండు హెక్టార్ల వ్యవసాయ భూమి కలిగిన సన్నకారు రైతుల వ్యవసాయ రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. వ్యవసాయ వృద్ధిరేటును సాధించే నిమిత్తం పలు పథకాలను ఆయన ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అనుసరించి సహకార బ్యాకింగ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు రూ.3074 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించారు.
తాజాగా ప్రకటించిన రుణాల మాఫీలో రూ.60 వేల కోట్ల రూపాయల మేరకు వున్నట్టు మంత్రి చిదంబరం వివరించారు. అలాగే మార్చి 31 2008 లోగా వ్యవసాయం మరియు నీటి వనరుల కార్పోరేషన్లను వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏఐబిబి పథకం ద్వారా 24 భారీ మధ్యతరహా, 253 చిన్నపాటి నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఐదు లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 500 మొబైలో సాయిల్ టెస్టింగ్ పరీక్షా కేంద్రాలని రైతులకు అందుబాటులోకి తెస్తామని చిదంబరం వెల్లడించారు. జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని కొనసాగించనున్నట్టు సభకు తెలిపారు.