రాక్షసకుల స్త్రీకి, మునికి జన్మించిన గజముఖాసురుడు.. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి ఆదేశం మేరకు ఘోర తపస్సు చేసి శివుని మెప్పిస్తాడు.
ఇంకా శివుని నుంచి కొన్ని వరాలు పొందుతాడు. అలా పొందిన వరాలకు గర్వం తోడు కావడంతో, వాటిని దుష్టమార్గాన ఉపయోగించడం ఆరంభిస్తాడు.
ఆకాశం, భూమి రెండూ తనకు బానిసలు కావాలని అత్యాశ పెంచుకుంటాడు. ఇలా గజముఖాసురుడి వల్ల దేవతలకు, ప్రజలకు ఎదురయ్యే కష్టాలకు అంతులేకుండా పోతుంటుంది.
ఆ తరుణంలో దేవతలంతా ఇంద్రునితో మొరపెట్టుకోగా, అందరూ కలిసి కైలాసానికి వెళ్లి వినాయకుడిని శరణు వేడుతారు. దేవతల మొరను ఆలకించి గణాధిపుడు గజముఖనగరాన్ని ముట్టడిస్తాడు. యుద్ధంలో రాక్షసులను ధీటుగా ఎదుర్కొన్న గణపతి, గజముఖాసురుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు.
అప్పటికే గజముఖాసురినికి ఆయుధాలతో మరణం లేదని గ్రహించిన విఘ్నేశ్వరుడు.. తన దంతాల్లో ఒకదానికి విరిచి రాక్షసుడి మీదకు విసురుతాడు. వెంటనే గజముఖుడు రాక్షస రూపాన్ని చాలించి మూషికరూపం ధరిస్తాడు.
పోరులో భాగంగా మూషికం మీదకు విఘ్నేశ్వరుడు తక్షణం అధిష్టించి, రాక్షసునిపై గణేశుడు విజయం సాధిస్తాడు. తదనంతరం జరిగిన తప్పులకు పశ్చాత్తాప పడిన గజముఖునికి గణేశుడు మోక్షం ప్రసాదించి అతనిని వాహనంగా మలుచుకుంటాడు.
అప్పటి నుంచి గజముఖుడు వినాయకుడి వాహనంగా మారాడు. ఇలా ఏకదంతుడైన వినాయకుడిని గణేశ చతుర్థినాడు స్తుతించిన వారికి విఘ్నములు తొలగిపోవడంతో పాటు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పురోహితులు అంటున్నారు.