వినాయక చవితికి, దసరాకు నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత ఆ దేవతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో గణేశ నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తున్నారు.
వినాయక చవితి నాడు కానీ 3, 5, 7, 9వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య వున్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను అందరూ భుజించి ఆ తర్వాత సంప్రదాయ బద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి.
నిమజ్జన ఊరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు సహజమే. గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో ఎంతో శాస్త్రోక్తంగా పూజ చేసి మరీ ఉత్సవాలను ప్రారంభిస్తారు.
మరి నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి సంప్రదాయం పాటించాలి? ఏ మంత్రాన్ని ఏ శ్లోకాన్ని పఠిస్తూ ఆ గణనాధుడ్ని నీటిలోకి వదలాలి? నిమజ్జన ఉత్సాహ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించే వారు చాలా తక్కువమంది వుంటారు.
అసాధ్యమైన విషయమేమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాధుడ్ని నీటిలోకి జారవిడిచే ముందు "శ్రీ గణేశం ఉద్వాసయామి... శోభనార్థం పునరాగమనాయచ" అని చెప్పుకోవడం సంప్రదాయం.