ఏ కొత్త పని ఆరంభించినా, ఏ పండుగ వచ్చినా, శుభకార్యాలు జరిగినా తొలి పూజలందుకునే గణపతిని ఎవరైతే.. నిజాయితీగా, నిండు మనస్సుతో కొలుస్తారో వారి కోరికలను తీర్చి సంపదల్ని, అదృష్టాన్ని విఘ్నేశ్వరుడు ఒసగుతాడు.
అలాంటి వినాయకుడి ఆశీస్సులు లేకుండా ఏ పని పూర్తి కాదని భక్తుల నమ్మకం. పూర్వం రాక్షస సంహార కార్యక్రమానికి ముందు తండ్రి శివుడు సైతం పుత్రుడైన గణేశుని ఆశీస్సులు పొందకపోవడం వల్ల రథచక్రాలు విరిగిపోయాయని చెప్తారు.
అట్టి మహిమాన్వితమైన విఘ్నేశ్వరుడు హిందువుల పవిత్ర గ్రంథం మహాభారతాన్ని రచించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాభారతాన్ని రచించాల్సిందిగా వ్యాసభగవానుడిని బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు. అందుకు అంగీకరించిన వ్యాసుడు తాను భారతాన్ని చెప్తానని, అయితే తాను చెప్పింది చెప్పినట్లు రాయగల ప్రజ్ఞావంతుడిని పంపించమని కోరుతాడు.
తాను చెప్తున్నప్పుడు ఆపకూడదని, ఒక్కక్షణం కూడా వృథా కాకూడదని, మధ్యలో ఆపకూడదని, అటువంటి వాడిని పంపమని అడుగుతాడు. ఇందుకోసం బ్రహ్మ "గణపతి"ని పంపుతాడు.
వ్యాసుడు చెప్పింది చెప్పినట్లు అక్షరం పొల్లుపోకుండా, విరామం లేకుండా విఘ్నేశ్వరుడు విరిగిన దంతంతో రాసుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్ద పెద్ద వాక్యాల్ని సమాసాలతో కూడి చెప్పి వ్యాసుడు పరీక్ష పెడుతూ చెప్పినా వినాయకుడు తొణకడు. శీఘ్రంగా రాస్తూ తనకప్పగించిన మహాకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాడు.
అందుకే విఘ్నేశ్వరుడిని ప్రతినిత్యం నిష్టతో ప్రార్థించిన వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.