విఘ్నేశ్వర జననం గురించి మీకు తెలుసా?

FILE
విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి. వాటిని ఒక్కొక్క పురాణం ఒక్కో విధంగా వర్ణించింది. వాటిలో వరాహ పురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా వుంది.

ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుంచి జన్మించినట్లు చెప్పింది. రాక్షసుల బాధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుంచి విముక్తి చెందే ఉపాయం చెప్పమని ఋషులు, దేవతలు శివుడిని అడిగారు.

పరమ శివుడు ఈ విషయమై సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఒకసారి తల ఎత్తి ఆకాశం వంక చూశాడు. అప్పుడు ఆయన కంటికి అత్యంత సుందరంగా పార్వతీదేవి కనిపించింది. శివుడు అప్రయత్నంగా పంచభూతాలలో తక్కిన వాటికంతా రూపం ఉండగా ఆకాశానికి ఎందుకు లేదు. అని ప్రశ్నించాడట.

జగజ్జనని అయిన పార్వతిని చూచి పరమ శివుడే అట్లా ప్రశ్నించడంతో ఆకాశం పుత్రరూపం దాల్చి శివుడి ఎదుట నిలిచింది. అదెంత సుందర రూపమంటే పార్వతిదేవి కూడా చంచల చిత్తంతో చూసిందట. ఆ బాలుడు ఇతర దేవతా స్త్రీలను కూడా అట్లాగే భ్రమింప చేయడంతో పరమ శివుడికి కోపం వచ్చి "నీవు ఏనుగు తల, బాన కడుపుతో వికార రూపుడవు కమ్మని శపించాడు" వెంటనే ఆకాశం నుంచి జన్మించిన ఆబాలుడు ఆ రూపంలోకి మారాడు.

ఈశ్వరుని వల్ల విఘ్నత చెందడం వల్ల ఆయనకు విఘ్నేశ్వరుడనే పేరు వచ్చింది. అంతటితో శివుడి కోపం చల్లారలేదు. ఆయన శరీరం చెమర్చింది. ఆ చెమట చుక్కల నుంచి వేలకు వేలు గజాస్యులు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత దేవతలంతా పరమ శివుడిని ప్రార్థించి శాంత చిత్తుని చేశారు.

అలా పుట్టిన గజాస్యులు విఘ్నేశ్వరుని పరివారంగా ఉంటుందని గణాధిపతిగానేకాక ప్రతికార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు అనుగ్రహించాడు. కాబట్టి వరాహ పురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు ఆకాశ స్వరూపమని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి