నెలసరి నొప్పుల్ని దూరం చేసే ఆహారం

గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:55 IST)
నెలసరితో మహిళలకు ఇబ్బందులు తప్పవు. ఈ సమయంలో ఎదురయ్యే పొట్టనొప్పి, అలసట, చిరాకు. ఒత్తిడిని ఎదుర్కోవాలంటే.. ఆహారంలో మార్పులు చేర్పులు అవసరం. నెలసరి దగ్గరపడే కొద్ది మసాలా ఆహారాన్ని తగ్గించాలి. పూర్తిగా పక్కనబెట్టేసినా మేలే. వీలైనంతవరకు పోషకాహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు క్యాల్షియం తగు మోతాదులో అందేందుకు పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. 
 
నెలసరి దగ్గర పడుతున్న కొద్దీ.. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు ఎక్కువగా తింటే మంచిది. అలాగే అవిసె గింజల్లో క్యాల్షియంతో పాటు మెగ్నీషిం మోతాదు కూడా ఎక్కువ. ఈ పోషకాలు నెలసరి సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గిస్తాయి.
 
అలాగే కాఫీలు, చాక్లెట్లు తగ్గించాలి. కాఫీకి బదులు గ్రీన్ టీ, చామంతి వంటి హెర్బల్ టీలు తాగొచ్చు. తద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకు 15 నిమిషాల పాటు నడక, వ్యాయామం, స్కిప్పింగ్ చేయడం నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా రోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల మంచి నీళ్లు తాగడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి