అసాధ్యాన్ని సాధ్యం చేసినా సరే.. బంగ్లా జట్టుకు విజయం కష్టమే!
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (01:36 IST)
న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు సాధ్యంకాని విధంగా పసికూనం బంగ్లాదేశ్ మొక్కవోని పోరాటం శైలితో అలరించినప్పటికీ భారత్తో ఏకైక టెస్టుమ్యాచ్ను గెలుపొందడం ఇక సాధ్యం కానట్లే. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అలరించి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించినా, రెండో ఇన్నింగ్స్లో మొదట్లోనే తేలిపోవడంతో ఇక విజయం భారత్కు నల్లేరు మీద నడకే అవుతుందని అంచనా. అద్భుతం జరిగితే తప్ప బంగ్లా జట్టు విజయం అసాధ్యమే.
సొంతగడ్డపై భారత్ విజయ యాత్రలో మరో మ్యాచ్ చేరడానికి రంగం సిద్ధమైంది. పది వికెట్లు కూల్చే లక్ష్యంలో ఇప్పటికే ముగ్గురిని పెవిలియన్ పంపించిన టీమిండియా ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టింది. పిచ్ స్పిన్కు అనుకూలించడం ప్రారంభమైపోయింది, వాతావరణం సమస్యా లేదు... మన విజయాన్ని అడ్డుకోగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడూ అటు వైపు లేడు. మిగిలిన ఏడు వికెట్ల లాంఛనాన్ని ఎంత త్వరగా ముగిస్తారన్నదే తేలాల్సి ఉంది.
భారత గడ్డపై తొలిసారి టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న బంగ్లాదేశ్కు టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోలేని లక్ష్యం ఎదురుగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చూపినా... రెండో సారి అదే తరహాలో ఆడటం అంత సులువు కాదు. ప్రధాన బ్యాట్స్మెన్ నిష్క్రమించిన నేపథ్యంలో మరో 90 ఓవర్లు ఆడి మ్యాచ్ను కాపాడుకోవడం వారికి శక్తికి మించిన పనే కానుంది. వెరసి బంగ్లాదేశ్కు ఈ టెస్టు ఒక పాఠంగా మిగిలిపోవచ్చు.
హైదరాబాద్ బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. 459 పరుగుల అతి భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ (21 బ్యాటింగ్), మహ్ముదుల్లా (9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా విజయం కోసం మరో 356 పరుగులు చేయాల్సి ఉంది. చివరి రోజు ఇది దాదాపు అసాధ్యం కాబట్టి ఆ జట్టు ‘డ్రా’ కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇప్పటికే అశ్విన్, జడేజాలకు పట్టు చిక్కిన నేపథ్యంలో భారత్ విజయానికి చేరువైనట్లే.
అంతకుముందు ఉదయం బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 388 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (262 బంతుల్లో 127; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్కు 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బౌలర్లకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో కోహ్లి సేన ఫాలోఆన్ ఇవ్వకుండా మళ్లీ బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపించింది. తమ రెండో ఇన్నింగ్స్లో ధాటిగా ఆడుతూ 29 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చతేశ్వర్ పుజారా (58 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు.
ఓవర్నైట్ స్కోరు 3226తో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్కు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన నాలుగో బంతిని ఆడలేక మెహదీ హసన్ (51) క్లీన్బౌల్డయ్యాడు. కొద్ది సేపటికే తైజుల్ (10) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో 87 పరుగుల వద్ద ఉన్న ముష్ఫికర్కు తస్కీన్ (8) కాసేపు అండగా నిలిచి సెంచరీ చేయడానికి సహకరించాడు. ఇషాంత్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత అదే ఓవర్లో ముష్ఫికర్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత్ రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ వెంటనే ఉమేశ్ బౌలింగ్లో ఫైన్లెగ్ దిశగా ఫోర్ కొట్టి శతకం అందుకున్న ముష్ఫికర్... అశ్విన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. అయితే తస్కీన్ను జడేజా అవుట్ చేయగా, ముష్ఫికర్ను అవుట్ చేసి అశ్విన్ 250వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. విరామానికి ముందు భారత్ ఒక ఓవర్ ఆడింది.