ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పెంచే ఉద్ధేశం లేదు : చిరయూ అమీన్

లలిత్ మోడీకి ఉద్వాసన పలికిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ కమిషనర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్నానని చిరయూ అమీన్ పేర్కొన్నాడు. క్రికెటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఆటపై దృష్టి కేంద్రీకరించాలన్న ఉద్దేశంతోనే లేట్ నైట్ పార్టీలకు స్వస్తి చెప్పామని అమీన్ వివరించాడు.

ఐపిఎల్‌ను క్రికెట్ టోర్నమెంట్‌గా చూడాలే తప్ప వినోద కార్యక్రమంగా కాదని వ్యాఖ్యానించాడు. టోర్నీ ప్రారంభోత్సవ వేడుకను దేశవిదేశాల్లో ఎక్కువ శాతం మంది వీక్షించారని టిఆర్‌పి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అన్నాడు. స్పాన్సర్‌షిప్ అందిస్తున్న కంపెనీల జాబితాలో కొత్తగా వోక్స్ వాగన్ కూడా చేరిందని చెప్పాడు.

మరో ప్రశ్నపై స్పందిస్తూ ఐపిఎల్‌లో జట్ల సంఖ్యను పెంచే యోచన లేదని అన్నాడు. ప్రస్తుతం ఉన్న ఫార్మెట్, తీసుకున్న నిర్ణయాలను అనుసరించి జట్ల సంఖ్య పదికే పరిమితమని సంఖ్య పెంచే ఉద్ధేశం లేదన్నాడు.

బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, ఐపిఎల్ కమిషనర్‌గా, బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్న ఆయన తన బాధ్యతలపై మాట్లాడుతూ వ్యూహాత్మకంగా వ్యవహరించి, ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూపోతే, ఎన్ని బాధ్యతలనైనా అవలీలగా, సమర్ధంగా నిర్వహించవచ్చని అన్నాడు.

వెబ్దునియా పై చదవండి