పోస్టర్ వివాదం: రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే..!?

గురువారం, 19 డిశెంబరు 2013 (14:19 IST)
FILE
తమిళ ప్రేక్షకులు 'తలైవా' అని పిలుచుకునే సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల తమిళనాడులో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో అంతాబాగానే ఉంది కానీ రజనీఉన్న ఓ పోస్టర్ ఇప్పుడు వివాదాలకు దారితీసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా యావత్ తమిళనాడు మొత్తం అన్నదానాలు, పూజలు, సేవాకార్యక్రమాలు చేశారు.

చెన్నైలో అయితే ఈ వేడుకలను మరింత ఘనంగా జరిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సిటీలో ఎన్నోపోస్టర్లు అంటించారు అభిమానులు. అయితే ఓ పోస్టర్‌లో 'రజనీకాంత్ ఓటు వేయడానికి క్యూలో నిలబడినట్లు, ఆయన వెనుక వినాయకుడు, విష్ణుమూర్తి నిలబడినట్లుగా ముద్రించారు. దాంతో పాటు 'తలైవా' (నాయకుడా)! నువ్వు కనుక రాజకీయాల్లోకి వస్తే దేవుళ్ళు కూడా ఓటేస్తారు' అని రాశారు.

ఇది విశ్వ హిందూ పరిషత్‌వారికి ఆగ్రహాన్ని కలిగించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని వారు మండిపడుతున్నారు. ఇలా చేయడం తగదంటూ ఫిర్యాదు చేశారట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే, రజనీకి ఈ పోస్టర్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా, అభిమానుల అత్యుత్సాహం ఇంత పని చేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి