అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ "ఏరువాక పౌర్ణమి". ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగను రైతన్నలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఈ పండుగ రోజున రైతన్నలకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ, కాలి అందియలు ఘల్లు ఘల్లుమని గంటలు మ్రోగించుకుంటూ "ధాన్యలక్ష్మి"ని ఇంటిని తోడ్కొని వచ్చే బసవన్నలను శుభ్రముగా కడిగి, ఎద్దుల కొమ్ములకు వివిధ రంగులు పూసి, వాటి మెడలో కొత్త గంటలు, రంగుల పూసలు, పూలతో నిండిన దిష్ఠితాళ్ళతో అలంకరిస్తారు.
తర్వాత మంగళవాద్యములతో పొలమునకు తోడ్కోని పోయి భూమిని దుక్కి దున్ని 'ఏరువాక' ప్రారంభిస్తారు. ఈ శుభదినాన ఏరువాక ప్రారంభించే రైతులకు, అన్నదాతలకు సిరుల పంట పండుతుందని విశ్వాసం.
ఈ ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది. పూర్వము శ్రీ కృష్ణదేవరాయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ.. ఒక బంగారు రంగు నాగలిని కర్షకులకు అందించినట్లు గాథలున్నాయి. అందుచేత ఏరువాక పౌర్ణమి అయిన ఈ రోజున (జూన్ 15) రైతన్నలకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం...!