సంఘం శరణం గచ్ఛామి.. బుద్ధం శరణం గచ్ఛామి..

FILE
పశువుల వధ, జీవ హత్యల నిలుపుటకు మాయాదేవి గర్భమున భగవానుడు బుద్ధునిగా అవతరించెను. దాదాపు రెండున్నరవేల సంవత్సరాలకు పూర్వం కపిల వస్తు సామ్రాజ్యాన్ని శుద్ధోదన మహారాజు పరిపాలించాడు. కలియుగంలో విష్ణు అవతారంగా పరిగణించే బుద్ధభగవానుడు, గౌతముడిగా శుద్దోదన మహారాజుకు ఏకైక సంతానంగా కలిగాడు. గౌతముడు అవతార పురుషుడు కనుకనే బాల్యంలోనే, మానవ జీవిత పరమార్థాన్ని గ్రహించాలన్న జిజ్ఞాస కలిగింది.

పాతికేళ్లయినా తనకు జన్మనిచ్చిన జననీ జనకుల్ని, ఆజన్మాంతం వెంట ఉంటానంటూ వచ్చిన ఇల్లాలినీ, ఆమె జన్మ ఇచ్చిన పసికందుని నిర్దయగా వదిలేసి, తనకు సంక్రమించే రాజ్యాధికారాన్ని భోగభాగ్యాల్ని తృణప్రాయంగా త్యజించి గయ చేరుకున్నాడు.

అక్కడ ఒక బోధి వృక్షం నీడన రోజుల తరబడి తప్పస్సాచరించాడు. ఆ తపస్సు ఫలించింది. వైశాఖ పూర్ణిమ పర్వదినాన-అతడు తేజోవిభుడయ్యాడు. జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు. మానవజీవితం దుఃఖమయమని, అటువంటి మానవజన్మను మంచి పనుల ద్వార మోక్ష సాధనకు మార్గంగా మలచుకొమ్మని బోధించాడు. ఎన్నో దేశాలు పర్యటించాడు.

ఎందరికో హితవు పలికాడు. సామాన్యులు మొదలుకొని అసమానుడైన అశోక చక్రవర్తి వరకు ఎందరో ఆయన అభిమతాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచారు. బౌద్ధ మతానికి ప్రాణం పోశారు. బౌద్థమతంలో కుల, మత, వర్ణ, వర్గ విభేదాలకు ఏమాత్రం తావు లేదు. సమతా వాదమే బౌద్ధమత సారాంశం.

కాబట్టి బుద్ధ భగవానుడు ప్రతిపాదించిన "సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి" అనే మూడు సూత్రాలు ఈ కలియుగంలో కరదీపికలు కావాలని మనం ఆశిద్దాం..!

వెబ్దునియా పై చదవండి