అసలు గణతంత్ర దినోత్సవం అంటే...?

FILE
భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.

అలా.. 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.

కాగా.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలాకాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.

1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
సాహస బాలలకు సలాములు..!
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహసబాలల అవార్డుల గురించే. సాహస బాలలు స్ఫుర్తి ప్రధాతలు. సాహసం, తెగువ, సమయస్ఫూర్తి, అన్నింటినీ మించి ఆపదలో ఉన్నవారిని కాపాడాలనే మానవతా.. ఇన్ని సుగుణాలు కలిగిన 21 మంది సాహసబాలలు 2009 సంవత్సరానికి..


ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలుజరిపారు. ఆనాటి నుంచి భారతదేశము "సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర" రాజ్యంగా అవతరించబడింది. అప్పటినుంచి ఈరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనదేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులకు పతకాలను అందజేస్తారు. అదే విధంగా ఈ రోజును పురస్కరించుకుని దేశ రాజధానిలోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ గొప్ప గొప్ప పెరేడ్‌లను నిర్వహిస్తారు. అనేక పాఠశాలల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ పెరేడ్‌లలో పాల్గొంటారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా.. ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ, ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి ఒక్క పాఠశాలలోనూ జనవరి 26ను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు.

FILE
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహసబాలల అవార్డుల గురించే. ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు, తమ ప్రాణాలకు సైతం తెగించి నిస్వార్థంతో, ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వము 'జాతీయ సాహస బాలల పురస్కారాల' ( నేషనల్‌ బ్రేవరీ అవార్డ్స్‌) ను ప్రవేశపెట్టింది. ఈ అవార్డును ప్రతి ఏటా అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు ప్రదానం చేస్తారు.

సాహస బాలలు స్ఫుర్తి ప్రధాతలు. సాహసం, తెగువ, సమయస్ఫూర్తి, అన్నింటినీ మించి ఆపదలో ఉన్నవారిని కాపాడాలనే మానవతా.. ఇన్ని సుగుణాలు కలిగిన 21 మంది సాహసబాలలు 2009 సంవత్సరానికిగానూ ఎంపికయ్యారు. వీరందరికీ జనవరి 21వ తేదీన న్యూఢిల్లీలో దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డులు పొందినవారిలో 13 మంది బాలురు, 8 బాలికలుండటం విశేషం.

ఈ జాతీయ సాహస బాలల అవార్డులకు ముగ్గురు ఆంధ్ర బాలలు కూడా ఎంపికయ్యారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన రాయవల్లి వంశీ(12)కి "బాపూ గయాధాని" అవార్డు లభించింది. వంశీతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్(6), కర్నూలుకు చెందిన చినిగి సాహెబ్‌‌లకు అవార్డులు లభించాయి. కాగా.. అవార్డులు పొందిన బాలలందరూ ఏనుగు అంబారీఎక్కి గణతంత్ర దినోత్సవం రోజున జరిగే కవాతులో పాల్గొంటారు.

ఈ అవార్డులను పొందిన బాలలకు ఒక మెడల్‌నూ, సర్టిఫికేట్‌నూ, క్యాష్‌ అవార్డ్‌తో కలిపి ప్రదానం చేస్తారు. 'భారత్‌' అవార్డ్‌ గెలుపొందినవారికి గోల్డ్‌ మెడల్‌నూ, మిగిలిన ఇతర అవార్డులను పొందినవారికి సిల్వర్‌ మెడల్స్‌నూ అందిస్తారు. ఇవే కాక ఈ అవార్డులను పొందినవారికి నగదుపురస్కారంతో పాటూ, వారి చదువు కోసం ప్రోత్సాహకాలను, ఉపకార వేతనాలనూ ప్రభుత్వం అందిస్తుంది.

సాహస బాలల అవార్డుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచీ, ప్రభుత్వ విభాగాలనుంచీ, పంచాయతీల నుంచీ, జిల్లాపరిషత్‌ల నుంచీ స్కూల్‌ అథారిటీస్‌ నుంచీ, బాలల సంక్షేమ మండలి నుంచీ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తారు. ఇందుకోసం 'ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌' (ఐసిసిడబ్ల్యు) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిష్పక్షపాతంతో వచ్చిన దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి అర్హులైనవారిని ఎంపిక చేస్తుంది.

పిల్లలూ.. ఈ గణతంత్ర దినోత్సవం రోజునుంచైనా.. ఎవరైనా ఆపదలో వుంటే సాహసంతో, నిస్వార్థంతో కాపాడేందుకు ప్రయత్నించాలి. అంతేగానీ, మనకెందుకులే అని అనుకోకూడదు. సహాయం చేసే ఉద్దేశ్యం ఉంటే, ఆపనని నిర్భయంగా చేసేందుకు ప్రయత్నించాలేగానీ, మీనమేషాలు లెక్కిస్తూ ఉండకూడదు. అయితే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ధర్మమేగానీ, చేయలేని పనులకు పూనుకోకూడదు. మనం చేయంగలం అనుకున్న పనులు, తెలివితేటలు, సాహసం ఉంటేనే అందుకు పూనుకోవాలి.

వెబ్దునియా పై చదవండి