వర్షాకాలం రాగానే మూలనున్న గొడుగులకు దుమ్ము దులుపుతారు. అప్పటివరకూ గొడుగుల గురించి ఆలోచన రాదు. పాతతరం వారైతే ఎండాకాలంలో కూడా గొడుగులు వాడేవారు. గొడుగంటే నల్లగుడ్డ గొడుగులు మాత్రమేనన్న రోజుల్లో దానిమీద తెల్లగుడ్డ కుట్టించి ప్రత్యేకంగా ఎండాకాలం వాడేవారు.
కాని నేటి పరిశోధకులు ఎండా వానలకే కాదు అన్ని కాలాలలోనూ గొడుగు అవసరమేంటున్నారు. పలు కారణాల వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి కాలుష్యం పెరిగింది.
సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలు అధికమయ్యాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ పెరుగుతోంది. ముఖ్యంగా తెల్లరంగు చర్మం వున్నవారికి దీని ప్రభావం అధికంగా ఉంటుంది.
ఎండ ప్రభావంతో చర్మం ముడతలు పడి వార్థక్య లక్షణం వస్తోంది. ఇటువంటి ఇబ్బందుల నుండి బైటపడాలన్నా, ఎండ తీవ్రత చర్మంపై ఉండకూడదన్నా అన్ని రుతువులలో మీ చర్మాన్ని గొడుగు నీడలో ఉంచడమే మేలంటున్నారు.