ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

ఠాగూర్

శనివారం, 28 జూన్ 2025 (18:39 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయి 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనపై ఎయిర్‌‍క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్‌కు ముప్పు పొంచివున్నట్లు నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది. 
 
ఏఏఐబీ డీజీ యుగంధర్‌కు ఇక నుంచి ఎక్స్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. జూన్ 16వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నాయి. దీని ప్రకారం ఆయనకు సీఆర్పీఎఫ్ కమాండాలతో రక్షణ కల్పిస్తున్నారు. ఈ ఘటన జూన్ 12వ  తేదీన చోటుచేసుకోగా, ఆ మరుసటి రోజే ప్రమాదంపై దర్యాప్తునకు ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 
 
దీనికి యుగంధర్ నేతృత్వం వహిస్తుండగా ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణలు సభ్యులుగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌లను ఏఏఐబీ ల్యాబ్‌కు తరలించారు. అందులోని డేటాను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు