అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదూ అంటే తిరుమలలోని టీటీడీ టెంకాయల కొట్టులాగే ఉంటుంది. టెంకాయల కొట్టులో స్వామికి ఎంతో భక్తితో టెంకాయ, కర్పూరం అగబత్తులు, ఆకు వక్కా సమర్పిస్తుంటాం. ఇది సహజం. కానీ టీటీడీ కొట్టులో టెంకాయ మాత్రమే చేతిలో పెట్టి తూరుపు తిరిగి దండం పెట్టుకోమని చెబుతున్నారు.
తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం భక్తులు అఖిలాండం వద్ద కర్పూరం, అగర్ బత్తీలతో కొబ్బరికాయ సమర్పిస్తుంటారు. వీటిని ప్రయివేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయకుండా టీటీడీ కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఇంతవరకూ చాలా బాగుంది. ప్రైవేటు వ్యాపారాల కారణంగా భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారనే ఉద్దేశ్యంతో తామే కొట్టును ఏర్పాటు చేశారు.
ఇక్కడ గతంలో రూ.10కే కర్పూరం, అగర్ బత్తీలు, కొబ్బరికాయ ఇచ్చేవారు. ఇటీవల దాని ధరను రూ.15కు పెంచారు. టీటీడీ కౌంటర్లలో కొబ్బరికాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు నిలిపేస్తారో తెలియదు. ఇచ్చే కొబ్బరి కాయ పెద్ద గోళీ గుండుకు ఎక్కువ గుండ్రాయికి తక్కువ. కనీసం పిడికిట నిండా కూడా ఉండవు.