కొత్త సంవత్సరం రోజున డెన్మార్క్ రాణి సంచలన నిర్ణయం.. ఏంటది?

సోమవారం, 1 జనవరి 2024 (13:07 IST)
కొత్త సంవత్సరం రోజున డెన్మార్క్ రాణి మార్గరెట-2 సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ సింహాసనం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తన వారసుడిని కూడా ప్రకటించారు. దాదాపు ఆరు మిలియన్ల మంది ప్రజలు లైవ్‌లో వీక్షిస్తుండగా మార్గరెట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించగానే దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాు. తన తర్వాత సింహాసనంపై తన పెద్ద కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ రాజు పగ్గాలు చేపడుతారని తెలిపారు.
 
2023 ఫిబ్రవరిలో తన వెన్నెముకకు జరిగిన శస్త్రచికిత్స భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేసిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తర్వాతి తరానికి బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందని అప్పుడే అర్థమైందని పేర్కొన్నారు. పదవీ విరమణకు ఇదే సరైన సమయమన్న మార్గరెట్ జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి కాబోతున్నాయని, అదే రోజున సింహాసనాన్ని వీడనున్నట్టు తెలిపారు. అదే రోజు తన కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని వివరించారు.
 
ఇన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, 1972లో డెన్మార్క్ రాజు ఫ్రెడెరిక్-9 మరణానంతరం 31 సంవత్సరాల మార్గరెట్ -2 రాణిగా కిరీటం ధరించారు. దివంగత బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 తర్వాత యూరప్లో అత్యధికాలం సింహాసనం అధిష్టించిన రాణిగా మార్గరెట్ -2 రికార్డులకెక్కారు. ఆమె వయసు 83 సంవత్సరాలు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు