పోలీసులకు చుక్కలు చూపిస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు రౌడీషీటర్లను అరెస్ట్ చేయడంతో 14 ఏళ్ల నాటి హత్య కేసు మిస్టరీ వీడింది. దీంతో 14 సంవత్సరాల మర్డర్ కేసు ఫైల్ను పోలీసు క్లోజ్ చేశారు. మహ్మద్ హబీబ్ఖాన్, అస్గర్షా (కిషన్బాగ్ ) స్నేహితులు. ఇద్దరిపై బహదూర్పురా స్టేషన్లో రౌడీషీట్ ఉంది.
మరో ముగ్గురితో కలిసి వీరు 2000 సంవత్సరంలో ముర్గీ చౌక్లో ఓ వ్యక్తి వద్ద హవాలా రూపంలో వచ్చిన రూ. 10 లక్షలు దోపిడీ చేశారు. ఈ కేసును హుస్సేనీఆలం పోలీసులు సీసీఎస్కు బదిలీ చేయగా ఇటీవలే దీనిని మూసేశారు. కాగా, ఈ ముఠాలో హబీబ్కు సన్నిహితుడైన కిషన్బాగ్కే చెందిన ఆసీఫ్(22) ఉన్నాడు.
తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని..లేదంటే దోపిడీ విషయం పోలీసులకు చెప్పేస్తానని హబీబ్, అస్గర్ షాలను ఆసీఫ్ బెదిరించాడు. దీంతో ఇద్దరు డబ్బు విషయం మాట్లాడుకుందామని అక్టోబర్ 3, 2000లో ఆసీఫ్ను మెదక్ జిల్లా సదాశివపేటకు పిలిచి మరో ఐదుగురితో కలిసి హత్య చేశారు. మృతదేహాన్ని గిరంపూర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసి ఆనవాళ్లు కనిపించకుండా కాల్చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆనవాళ్లు పోలీసులకు ఏమాత్రం కానరాలేదు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చిన హబీబ్ఖాన్ అస్గర్ షాతో కలిసి దోపిడీలకు పథకం వేశారు.
సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కేవీ సూర్యప్రకాష్ రావు నేతృత్వంలోని బృందం గురువారం బహదూర్పురాలో హబీబ్ఖాన్, అస్గర్ షాలను అదుపులోకి తీసుకున్నారు. సోదా చేయగా తుపాకీతో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లు లభ్యమయ్యాయి. వారిని విచారించగా ఆసీఫ్ హత్య విషయం బయటపెట్టారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం బహదూర్పురా పోలీసులకు అప్పగించారు.