చెన్నై రాడిసన్ టెంపుల్ బే రిసార్ట్లో ఐఏఓఎంపీ సమావేశాలు
ఓరల్ అండ్ మక్సిల్లోఫాషియల్ పేథాలజిస్ట్ అసోసియేషన్ (ఐఏఓఎంపీ) తొలిసారిగా చెన్నైలోని రాడిసన్ టెంపుల్ బే రిసార్ట్లో అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం ఈ నెల 10 నుంచి 12 వరకూ జరుగుతుంది. సమావేశానికి దేశవిదేశాలకు చెందిన వేయిమంది నిష్ణాతులు పాల్గొననున్నారు.
రష్యా, థాయ్లాండ్, బ్రెజిల్, మెక్సికో, అమెరికా, హాంగ్కాంగ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రతినిధులు రానున్నారు. వీరంతా ఆయా శాఖల్లో అత్యంత ప్రావీణ్యమున్నవారు.
ఐఏఓఎంపీ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. రంగనాథన్ మాట్లాడుతూ.... ఈ సమావేశంలో శాస్త్రపరమైన మరియు భోధనాపరమైన అంశాలుంటాయన్నారు. దంత సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలపై వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సూచనలు, అనుమానాలను నివృత్తి చేస్తారన్నారు. సుమారు 400 మంది తమ తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారన్నారు.
డాక్టర్ కార్ల్ అల్లెన్, డాక్టర్ కానె, డాక్టర్ రే వంటి ప్రఖ్యాత వైద్యులు పాల్గొననున్నారు. దంత సమస్యలకు మూల కారణాలు ఏమిటి...? అవి ఎలా ఉత్పన్నమవుతాయి..? ఏ విధంగా నిరోధించవచ్చన్న దానిపై సూచనలు చేస్తారు. అదేవిధంగా నోటిలో పుండ్లు, నోటి క్యాన్సర్ ప్రారంభ దశ... తదితర వ్యాధులను ఎలా గుర్తించడం, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూలంకషంగా తెలియజేస్తారు.
ప్రాణాంతక వ్యాధులైన హైచ్ఐవీ- ఎయిడ్స్ నోటి ద్వారా ఎలా వ్యాప్తి చెందుతాయన్న విషయాలను ఆయా విభాగాల్లో నిపుణులైన వైద్యులు తెలియజేస్తారు. తొలిసారిగా దేశవిదేశాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వైద్యులు రావడం విశేషమని రంగనాథన్ తెలిపారు.
ఆ తర్వాత సంస్థ కార్యదర్శి డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ... దంత సమస్యలకు సంబంధించి దేశవిదేశాలకు చెందిన నిపుణులైన వైద్యులను ఒకచోట చేర్చి సమావేశాన్ని నిర్వహించడం ఒక్క ఐఏఓఎంపీకే సాధ్యమైందని అన్నారు.