తమిళనాడు సీఎం జయలలిత గత గురువారం రాత్రి అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై గ్రీమ్స్ రోడ్ అపోలో ఆస్పత్రిలో ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. ''అమ్మ''కు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. అమ్మ కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కంటతడి పెట్టుకున్నారు.
ఇక జయలలిత అనారోగ్యం పాలైందని తెలుసుకున్న తంజావూరు జిల్లా పట్టుకోట్టై 11వ వార్డ్ అన్నాడీఎంకే కార్యదర్శి మహేంద్రన్ (54) స్పృహ తప్పి కిందపడిపోవడంతో ఆపై అతని గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సీఎం జయలలిత అనారోగ్యం పాలవడంతో ఆమె కోసం ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే అన్నాడీఎంకే అధిష్టానం రూ.3లక్షలు నష్టపరిహారం ఇస్తుందని జోరుగా ప్రచారం సాగింది.