ఆవులు గల్లంతైతే.. చేతులు నరికేస్తారా?

మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:54 IST)
అవును ఆవులు గల్లంతైన పాపానికి.. 35 ఏళ్ల వ్యక్తిని చెట్టుకు కట్టేసి చేతులు నరికేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆవులు గల్లంతైన వ్యవహారంలో ఘర్షణ కారణంగా ఈ దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పిపల్‌వాలి గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆవులు కనిపించడం లేదంటూ ప్రేమ్‌ నారాయణ్‌ సాహూ అనే వ్యక్తి సత్తూ యాదవ్‌ గోశాలకు వెళ్లి ఆరా తీశారు. ఈ విషయమై ఘర్షణ జరగడంతో యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు సాహుపై దాడికి పాల్పడ్డారు. సాహును తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసి కత్తితో అతని చేతులు నరికేశారు. 
 
బాధితుడు సాయం చేయాలని అరిచినా గ్రామస్తులు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం అందించడంతో స్పందించిన పోలీసులు సాహూను ఆస్పత్రికి తరలించారు. బాధితుడిపై దాడికి పాల్పడిన కుటుంబంపై హత్యా యత్నం కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, యాదవ్ భార్య, ఆ ఇంటి పని మనిషి, కుమారుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు