పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

ఠాగూర్

బుధవారం, 2 జులై 2025 (08:38 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల మదురైలో జరిగిన ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై, హిందూ ముణ్ణని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. 
 
జూన్ 22న మదురైలో మురుగన్ భక్తుల మహానాడు పేరుతో హిందూ మున్నణి భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్, అన్నామలైలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, ఈ సభలో చేసిన ప్రసంగాలు, ఆమోదించిన తీర్మానాలు మతాల మధ్య విద్వేషాలు, చిచ్చుపెట్టేలా ఉన్నాయని, ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్దమని ఆరోపిస్తూ మదురైకు చెందిన న్యాయవాది, పీపుల్స్ ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ కోఆర్డినేటర్ ఎస్.వాంజినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు మేరకు మదురైలోని అన్నానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో పవన్, అన్నామలైపాటు హిందూ మున్నణి అధ్యక్షుడు కదేశ్వర సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి ఎస్. ముత్తుకుమార్, ఇతర ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ, సంఘ్ పరివార్ నిర్వాహకులను నిందితులుగా చేర్చారు. కాగా, ఆధ్యాత్మిక సభలో రాజకీయ, మతపరమైన ప్రసంగాలు చేయొద్దంటూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ గతంలో ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను మహానాడులో పాల్గొన్న నేతలు ఉల్లంఘించారని సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు