దేవేందర్‌ పార్టీ పేరు.. "నవ తెలంగాణ ప్రజాపార్టీ"

శుక్రవారం, 11 జులై 2008 (19:40 IST)
FileFILE
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పని చేసే విధంగా 'నవ తెలంగాణా ప్రజాపార్టీ' అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జెండాలో పుస్తకం, నాగలి, పార, తెలంగాణ చిత్రపటాలను ముద్రించారు. జెండా రంగును పాలపిట్ట వర్ణంగా తీర్చిదిద్దారు.

పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన నివాసానికి వచ్చే అభిమానులు, మద్దతుదారుల సంఖ్య ఎక్కువైంది. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ మనస్సును చంపుకోలేకనే కొత్త పార్టీని స్థాపించినట్టు తెలిపారు. తమ పార్టీ అగస్టు 27వ తేదీన నిజాం మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు.

తాము పేర్కొన్న జెండాలో పాలపిట్ట రంగు శుభాన్ని, తెలంగాణా జీవనదులను సూచిస్తోందని దేవేందర్ తెలిపారు. నాగలి రైతుల చైతన్యాని సూచిస్తుందని, పార కార్మికుల, నిరు పేద ప్రజల అభ్యున్నతికి ప్రతీక ఆని ఆయన తెలిపారు.

పుస్తకం, కాగడ విద్యార్థులు, యువకులకు చైతన్యానికి గుర్తని మార్గదర్శకాన్ని సూచిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందించడానికి తమవంతు కృషి చేస్తామని దేవేందర్ హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి