ఇంగిత జ్ఞానంలేని చౌకబారు నేత కేసీఆర్: బాబు

బుధవారం, 28 అక్టోబరు 2009 (11:24 IST)
రాష్ట్ర రాజకీయ నేతల్లో ఉన్నటువంటి వారిలో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావుకు కాస్త కూడా ఇంగిత జ్ఞానం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి భవిష్యత్‌లో కూడా మళ్లీ పుట్టబోరన్నారు. కేసీఆర్‌లా తాను దిగజారిపోయి మాట్లాడడం చేతకాదని బాబు వ్యాఖ్యానించారు.

తమ లక్ష్యాల సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు హుందాగా వ్యవహరించాలన్న కనీస జ్ఞానం లేని కేసీఆర్ వంటి నేతలు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. తమ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందే కానీ, ఇలాంటి చౌకబారు రాజకీయ నేతలు చేసే పనికిమాలిన వ్యాఖ్యలపై స్పందించబోమన్నారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉండే ప్రతి నేత వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారన్నారు. ఇలాంటి వారికి సరైన సమయంలో ప్రజలే తగిన విధంగా గుణపాఠం నేర్పుతారని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలపై తెలుగుదేశం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని ప్రకటించారు. గతంలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిల హయాంలో కూడా తాము పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి