రాజీనామా చేస్తే మళ్లీ గెలవగలమా: జగన్ వర్గ సందేహం!!

బుధవారం, 19 జనవరి 2011 (14:01 IST)
ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానానికి యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో మాత్రం ఆయన వర్గీయులకూ ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి సవాల్‌ను స్వీకరించి తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే తిరిగి గెలవగలమా అనే ధర్మసందేహం తలెత్తుతోంది.

ఇదే అంశంపై జగన్‌తో పాటు కడప జిల్లాకు చెందిన ఆయన వర్గీయులు తాజాగా రహస్య భేటీని నిర్వహించినట్టు సమాచారం. ఇందులో పాల్గొన్న జగన్ వర్గీయులు తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. మంత్రి డీఎల్ సవాల్‌పైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.

కడప జిల్లాలో జగన్‌కు మద్దతునిస్తున్న ఆదినారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసులు, కమలమ్మ, అమరనాథ్‌రెడ్డిలతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌ రెడ్డి, పిసిసి జిల్లా నాయకుడు సురేష్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు మద్దతు ప్రకటించారు.

ఈ జిల్లాలో జగన్‌కు చెక్ పెట్టేందుకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు (వైఎస్.వివేకా, డీఎల్, అహ్మదుల్లా)లతో పాటు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలను ప్రభుత్వం నియమించింది. వీరికి ఏ విధంగా అడ్డుకోవాలన్న అంశంపైనే జగన్ వర్గం చర్చిస్తోంది.

మంత్రి డీఎల్ సవాల్‌ను స్వీకరించి డీఎల్‌తో సహా రాజీనామాకు సిద్ధమైతే మళ్లీ గెలవగలమా అనే సందేహాన్ని వారు లేవనెత్తినట్టు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే మళ్లీ గెలవలేమని అందుకే వెనక్కి తగ్గాలని కూడా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి