వరంగల్ డీఈఓ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి!

గురువారం, 15 సెప్టెంబరు 2011 (12:45 IST)
జిల్లా కేంద్రమైన వరంగల్‌లోని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంపై గురువారం కొంతమంది తెలంగాణ వాదులు దాడులు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్న సకల జనుల సమ్మెకు డీఈఓ ఏమాత్రం సహకరించడం లేదని వారు ఆరోపించి ఈ కార్యాలయంలో చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో మద్దతు తెలుపకుండా విధుల నిర్వహిస్తున్న డీఈవోపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.

ఇదిలావుండగా, తెలంగాణ పది జిల్లాల్లో సకల జనుల సమ్మె మూడో రోజు విజయవంతంగా సాగుతోంది. సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. దీంతో నాలుగు జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రభుత్వ కార్యాలయాన్నింటికి తాళాలు వేసి ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. విద్యా సంస్థలను బంద్ చేసి విద్యార్థులు రాస్తారోకోలు, మానవ హారాలు చేపట్టారు.

న్యాయవాదులు కోర్టులకు వెళ్లకుండా విధులను బహిష్కరించారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ వచ్చేంత వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని ఉద్యోగులు ముక్త కంఠంతో చెపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు సినిమా హాళ్లను బంద్ చేశారు. పలు చోట్ల మార్కెట్ యార్డులు మూసి వేసి నిరసన తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి