జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు : సమైక్యాంధ్ర ఇకపై ఓ కల!

సోమవారం, 26 ఆగస్టు 2013 (17:22 IST)
File
FILE
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఇక ఓ కలగా మిగిలిపోనుందంటూ సెటైర్లు వేశారు. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉధృతంగా సాగుతున్నప్పటికీ.. దీన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్ పెద్దలు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉండటం కష్టమేనన్నారు. అందుకే తాము రాయల తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. టీ కాంగ్రెస్‌ నేతల్లో కొంతమంది‌, ఎంఐఎం నేతలు రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని జేసీ చెప్పారు.

అందుకే అనంతపూర్, కర్నూలు జిల్లాలను రాయలసీమ ప్రాంతం నుంచి విడదీసి తెలంగాణలో కలపాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆంటోనీ కమిటీకి లేఖలు కూడా ఇచ్చామన్నారు. అందువల్ల త్వరలోనే ఈ రెండు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నట్టు చెప్పారు.

అయితే రాయల తెలంగాణకు మంత్రి శైలజానాథ్ వ్యతిరేకిస్తున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా.. శైలజానాథ్‌కు పెద్ద పదవిపై కన్ను పడి వుండొచ్చన్నారు. అందువల్లే ఆయన రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి