డిసెంబరు తర్వాత ఎపుడైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే!!!

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అధికార పార్టీలో భగ్గుమంటున్న అంతర్గత కుమ్ములాటలు రోజురోజుగా పెరిగిపోతున్నాయి. వీటికి తోడు తెలంగాణ ఉద్యమం, వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ, ఎమ్మార్పీయస్ ఆందోళన, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక డెడ్‌లైన్ ఇలా ఎన్నో అంశాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధిష్టాన వర్గం రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం చేసుకుంటుందా? మూడో కృష్ణుడిగా తెరపైకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి రిమోట్‌ కంట్రోల్‌తో నడిపిస్తూ పరిపాలనా పగ్గాలను పరోక్షంగా గవర్నర్‌ నరసింహన్‌కు అప్పగించేలా అడుగులు వేస్తోంది.

ఇదే అంశంపై ఒక ఆంగ్ల వార్తా సంస్థ ప్రచురించిన వార్తా కథనం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది. రాష్ట్రంలో పాలనా పగ్గాలు కేకేఆర్ నిర్వహిస్తున్నప్పటికీ.. రిమోట్ కంట్రోల్ మాత్రం ఢిల్లీ అధిష్టానం చేతిలో ఉన్నదన్నది ప్రతి ఒక్కరికీ ఎరుకే. ముఖ్యంగా, డిసెంబర్‌ తర్వాత పరిస్థితిని కూడా అధిష్టానం సీరియస్‌గానే పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో గవర్నరు పాలన విధిస్తే...అందుకు ఇప్పటి నుంచే గవర్నరు సంసిద్ధంగా ఉండేలా... ప్రతీవారం రాష్ట్రంలో పరిస్థితిపై ఆయనకు నివేదికలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి ప్రసాద్‌, డీజీపీ అరవింద్‌రావులకు ఆదేశాలు అందినట్లుగా సమాచారం.

రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిఘా విభాగం మాజీ ఐజీ ఈఎస్ఎల్.నరసింహన్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఆయన వ్యవహారశైలిపై పలు విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.. ఆయన మాత్రం వెనుకంజవేయలేదు. అందువల్ల డిసెంబరు తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఇప్పటి నుంచే ఆయన రాష్ట్ర పరిస్థితిపై అవగాహన పెంచుకుంటున్నారన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి