ముష్‌కు ఏకపాత్రాభినయం చాలు: పాక్ ప్రజలు

శుక్రవారం, 14 డిశెంబరు 2007 (10:37 IST)
పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాక్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాలన పాక్‌కు ఎంతో అవసరమని అమెరికాకు చెందిన ఒక వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టం చేశారు. అయితే.. ఆర్మీ పదవిలో ముషారఫ్ కొనసాగరాదని పాక్ ప్రజలు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ఆర్మీతో ఎలాంటి సంబంధాలు లేకుండా దేశ పరిపాలన చేయాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముషారఫ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించకూడదని సర్వేలో వెల్లడించారు.

కాగా.. వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాక్ ప్రజలు ఏ పార్టీకి పట్ట కట్టక పోవడం గమనార్హం. మాజీ ప్రధానులు బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లీం లీగ్ - ఎన్, అధికార పీఎంఎల్ - క్యూ పార్టీల్లో దేనికీ తమ సంపూర్ణ మద్దతును తెలుపలేదు.

ఇదిలావుండగా.. పాకిస్తాన్‌లో గత నెల మూడో తేదీన ఎమర్జెన్సీని ముషారఫ్ విధించారు. ఆ తర్వాత ఆర్మీ పదవి నుంచి తప్పుకుని పాక్ దేశాధ్యక్షుడిగా ముషారఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాల అనంతరం నిర్వహించిన సర్వేలో పాక్ ప్రజలు ముషారఫ్‌కు బ్రహ్మరథం పట్టడంతో అధికార పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి