మృగశిర నక్షత్రంలో జన్మించిన మహిళలు ఇతరులను ఇట్టే ఆకట్టుకునే ఛాయను కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ధనవంతుల కుటుంబాల్లో జన్మించిన వారుగా ఉండే ఈ జాతకులకు భర్త, సంతానం ద్వారా అన్ని అనుకూలిస్తాయి. అయితే వీరికి సంతానంచే కలిగే సంతోషమే అధికమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇతరులకు వీలైనంత సహాయం చేయడంలో వెనుకాడని ఈ మృగశిర నక్షత్ర జాతకులకు పుట్టిల్లు-మెట్టిల్లు సుఖమయంగా ఉంటుంది. భర్తను పూర్తిగా అర్థం చేసుకుని ప్రవర్తించే ఈ జాతకులు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారు.
ఇకపోతే మృగశిర మొదటి పాదంలో పుట్టిన మహిళలు ఎలా ఉంటారంటే..? వీరి జీవిత విధానం ఎలాంటి దుఃఖాలను దరిచేర నీయకుండా సాఫీగా జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు ఆగ్రహం చెందడం వీరి నైజం ఎటువంటి సందర్బాల్లోనూ వీరి చేతిలో రుణ రాకపోకలు జరుగుతుంటాయి. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి యుంటారు. శత్రువులను చాలా సులభంగా జయిస్తారు. తెల్లటి ఛాయ రంగును కలిగియున్న వీరు, ఇతరుల కష్టాలను సులభంగా అర్థం చేసుకుంటారు. న్యాయ లావాదేవీలకు ఇది మంచి తరుణం.
రెండో పాదంలో పుట్టిన వారైతే..? వీరు సౌందర్యవంతులుగా ఉంటారు. అందరితో స్నేహభావంతో ప్రవర్తిస్తారు. మంచి, చెడులకు అనుగుణంగా నడుచుకుంటారు. కుటుంబ తగాదాలలో వీరి వాక్చాతుర్యానికి తగిన విధంగా సమస్యలు పరిష్కారమౌతాయి. ఓర్పుతో ప్రవర్తించి ఎటువంటి కార్యాన్నైనా పలుమార్లు ఆలోచించి రంగంలోకి దిగటం వీరి స్వభావం. భర్తయొక్క ఆదరణ ఎప్పుడు వీరికి ఉంటుంది. మొత్తానికి సుఖమైన జీవితాన్ని జీవిస్తారు.
మూడోస్థానంలో పుట్టిన వారైతే.. వీరి జీవితం సుఖవంతంగా నడుస్తుంది. ప్రతిభాశాలిగానూ..బుద్దిమంతులుగా ఉంటారు. దూరదృష్టితో ప్రవర్తిస్తారు. ఇతరులను దూషించటం వంటివి చేయరు శత్రువులకు దూరంగా ఉంటారు. తప్పు అనిపించే విషయాలకు ఏమాత్రం ప్రాధాన్యతను ఇవ్వరు. శాంత గుణం కలిగియుంటారు. అంతేగాక వీరికి ఉద్యోగంలో మంచి అభివృద్ధి లభిస్తుంది.
నాలుగో పాదంలో పుట్టినవారైతే.. శాంతంగా ఉండటం వీరి గుణం. ఎలాంటి విషయానికైనా ఆగ్రహం చెందరు. చెడుమార్గంలో పయనిస్తున్నా.. దాని గురించి ఆలోచించరు. కార్యాన్ని సాధించడంలో మాత్రమే తమ దృష్టిని సారిస్తారు. మొత్తానికి నిజాయితీ వీరి దగ్గర నిలకడగా ఉండదు. వీరం, వివేకాలతో అక్రమమైన త్రోవలో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తారు. ఇతరులను ఏమార్చి అభివృద్ది చెందటంలో వీరు సమగ్రులు. కానీ మంచి మార్గంలో పయనిస్తే.. ఈ జాతకులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మొత్తానికి మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులు ఈతిబాధల నుంచి తప్పుకోవాలంటే ప్రతి శనివారం లేదా శనిత్రయోదశినాడు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగంచడం చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా శనివారం పూట శ్రీ మహావిష్ణువును పూజిస్తే సుఖసంతోషాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.