మహావిష్ణువునే మనువాడిన గోదాదేవి

సోమవారం, 5 జనవరి 2009 (19:43 IST)
లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి శ్రీరంగంలో క్రీ.శ 776లో జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ద్రవిడ భాషల్లో గోదాదేవికి కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, అనే నామాంతరములు గలవు. తెలుగు సాహిత్యంలో సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం "ఆముక్తమాల్యద" గోదాదేవీ వైశిష్ట్యమునకు ప్రతీక. ఈ ప్రబంధానికి "విష్ణుచిత్తీయం" అనే మరోపేరున్న సంగతి తెలిసిందే.

ఇక గోదాదేవి జన్మ వృత్తాంత్తాన్ని ఓ సారి పరిశీలిస్తే.. శ్రీరంగంలో... ఆషాఢ శుద్ధ చతుర్దశిన, పుబ్బా నక్షత్రంలో గోదాదేవి జన్మించింది. గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత లక్ష్మీస్వరూపమైన గోదాదేవి, తన శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలనుకుంటుంది.

వైష్ణవుడైన విష్ణుచిత్తుడు రంగనాథ స్వామిని ప్రతినిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు. ఇందులో భాగంగా... ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలను సుందరంగా అల్లుకుని అలంకరణకు తీసుకుని వెళ్లేవాడు. అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తర్వాత స్వామివారికి పంపిస్తుంది.

ఈ రహస్యం తెలుసుకున్న విష్ణుచిత్తుడు దుఃఖించి రంగనాథుడికి మాలాధారణ గావించరు. దీంతో స్వామివారి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని విష్ణుచిత్తుడు బాధపడుతుంటే.. రంగనాథుడు విష్ణుచిత్తునితో ఇక ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారనే కావాలని ఆదేశిస్తారు. రంగన్న ఆదేశం మేరకే విష్ణుచిత్తుడు నడుచుకుంటాడు.

ఇంతలో శ్రీరంగనాథుడే తనకు భర్తగా రావాలని కోరుకుంటూ గోదాదేవి... తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావై" (తిరుప్పావు) వ్రతాచరణ చేస్తారు. ఈ వ్రతమహిమతో... లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి శ్రీరంగనాథుడి సతీమణి అవుతుంది. రంగనాథుడి ఆజ్ఞమేరకే గోదాదేవికి, రంగనాథస్వామికి విష్ణుచిత్తుడు దేవేరులకు భూలోకంలో వైభవంగా వివాహం జరిపించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది. అదిచూసి విష్ణుచిత్తుడు దుఃఖితుడైతే మలయప్ప స్వామి జ్ఞానోపదేశం చేస్తాడు. దీంతో విష్ణుచిత్తుడు గోదాదేవి లక్ష్మీస్వరూపి అని, తన కుమార్తె అన్న మాయ నుంచి బయటపడతాడు.

ఇకపోతే... గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ది చెందింది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ రోజుకొక్కటి చొప్పున ఓ పాశురం వైష్ణవ ఆలయాల్లో పఠించడం చేస్తారు. అందుచేత యువతులు ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ చేస్తే తను మెచ్చిన, సుగుణుడైన భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి