నెల్లూరు దర్గా చెరువులో పడిన సమైక్యాంధ్ర రొట్టె!

FILE
మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ-సమైక్యాంధ్రల పోరాటంతో రాష్ట్రం దద్ధరిల్లుతోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఎప్పటిలాగానే ఆరోగ్యం, విద్య, సంతానం, ఉద్యోగం, వివాహం, సౌభాగ్యం సంబంధమైన రొట్టెలే కాకుండా ఈ ఏడాది నెల్లూరు దర్గా చెరువులో సమైకాంధ్రను కోరుతూ.. "సమైక్యాంధ్ర రొట్టె" కూడా పడింది. అధిక శాతం ఈ నినాదంతో దర్గా వద్ద రొట్టెలు పట్టుకున్నారు. తొలిరోజున దాదాపు 2.5 లక్షల మంది దర్గావద్ద చెరువులో కిటకిటలాడారు.

ఈ పండుగలలో భాగంగా నిర్వహించే గంధ మహోత్సవం మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు ప్రారంభం కానుండటంతో భక్తుల సంఖ్య సోమవారం మరింత పెరిగింది. పెరుగుతున్న భక్తుల దృష్ట్యా ఆర్టీసీ అదనపు సర్వీసులు నడుపుతోంది.

ఇంకా నగర పాలక సంస్థతో పాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బారాషహీద్ దర్గావద్ద భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ రొట్టెల పండుగ కోసం వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి