శ్రీవారికి కానుకగా రూ. 50లక్షల కటి, వరద హస్తాలు

WD
కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమలేశునికి రూ.50లక్షల కటి, వరద హస్తాలను ఓ భక్తుడు కానుకగా అందజేశాడు. ఈ కటి, వరదహస్తాల్లో మూడు కిలోల బంగారాన్ని వాడారని, ఈ హస్తాల విలువ రూ. 50లక్షలుంటుందని తితిదే అధికారులు తెలిపారు. గురువారం రాత్రి వీఐపీ బ్రేక్‌లో దర్శనానికి వెళ్లిన సదరు భక్తుడు గుడిలోపల ఈవో కృష్ణారావుకు కటి, వరద హస్తాలను అందజేశారు.

ఇదిలా ఉంటే.. తిరుమలేశుని ఆలయంలో టీటీడీ ఉన్నతాధికారులు ఓ ప్రయోగం చేశారు. ప్రతి గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. దీంతోపాటు అన్ని సేవలు ముగిశాక ఉదయం 9 గంటలకు వీఐపీలు గంటపాటు దర్శనానికి వస్తుంటారు. ఆ తర్వాతే సామాన్యులను సర్వదర్శనం కింద అనుమతిస్తారు.

అయితే గురువారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన ఈవో కృష్ణారావు, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి స్వామివారి సేవలన్నీ త్వరితగతిన పూర్తయ్యేలా చూశారు.

వీఐపీ దర్శనాన్ని కూడా కుదించి 8.30 గంటలకల్లా సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. దీనివల్ల సామాన్యులు దాదాపు గంటన్నరపాటు క్యాలైన్లలో పడిగాపులుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఇదేవిధంగా వారపు సేవలను త్వరగా ముగించి, ఆ సయమాన్ని సామాన్యులకు కేటాయిస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి