అతడు ఒడిశాలో సీనియర్ ప్రభుత్వ ఇంజినీర్. అతడు వుంటున్న ఫ్లాట్ లోపల ఎటుచూసినా రూ. 500 నోట్లతో వున్న పెద్దపెద్ద బండిల్స్. అదేమీ అతడు కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ప్రజల నోళ్లు కొట్టి పోగేసుకున్నది. ఈ గుట్టు కాస్తా తెలియడంతో అతడి ఇంట్లో తనిఖీ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు బయలుదేరారు. వాళ్లు వస్తే ఎలాగూ డబ్బంతా పట్టుకుపోతారనుకున్నాడో ఏమోగానీ, చేతికి అందినంత డబ్బును తను వుంటున్న ఫ్లాట్ కిటికీ నుంచి కిందకు విసిరేయడం ప్రారంభించాడు. అన్నీ రూ. 500 కరెన్సీ నోట్లే. ఇంతలో అవినీతి అధికారులు అక్కడికి రానే వచ్చారు. దాంతో కరెన్సీ వర్షం కాస్తా ఆగిపోయింది.
ఇంతకీ ఈ భారీ అవినీతి తిమింగలం పూర్వాపరాలు ఏమిటో చూద్దాము. ఒడిశాలో గ్రామీణాభివృద్ధి శాఖలో వైకుంఠ నాథ్ సారంగి అనే ఈ వ్యక్తి చీఫ్ ఇంజినీర్. ఇంకేం, నిధులన్నీ ఈయన చేతులు మీదుగా ప్రవహిస్తుంటాయి. కనుక ఆ ప్రవాహానికి అక్కడక్కడ అడ్డుకట్టలు వేసుకుంటూ మొత్తం రూ. 2.1 కోట్లు నగదును ఇంట్లోనే బంధించేసాడు. గ్రామీణాభివృద్ధినంతా తన సొంత ఫ్లాట్లోనే చేసుకున్నాడు. బెడ్రూంలో, హాల్లో, ఇలా ఎక్కడబడితే అక్కడ రూ. 500 నోట్ల కట్టలను కుక్కేశాడు.
అవినీతి నిరోధక శాఖాధికారులు వచ్చి అతడి ఇంట్లో వున్న రూ. 2 కోట్ల నగదును చూసి షాక్ తిన్నారు. లెక్కింపు కోసం క్యాష్ కౌంటింగ్ మెషీన్లు తెచ్చుకున్నారు. ఇక్కడే కాదు, ఈ అవినీతి అధికారికి ఒడిశాలో వేర్వేరు ప్రాంతాల్లో 7 భవనాలు కూడా వున్నాయంట. జస్ట్... ఫ్లాట్ కదిలిస్తేనే రూ. 2 కోట్లు బైటపడ్డాయి. మరి మిగిలిన భవనాలను కూడా తనిఖీ చేస్తే ఇంకెంత బయటపడుతుందోనని చెప్పుకుంటున్నారు అక్కడి జనం.
గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవని రోడ్లు, కాలువలు, ఆస్పత్రులు కట్టించమంటే, వాటిలో కొంత మింగేసి అరకొర నిధులను విదిలించాడనే ఆరోపణలు ఇతడిపైన వున్నాయి. తను అడ్డంగా దోచేసిన డబ్బును అవినీతి అధికారులు పట్టుకుంటారని రూ. 2,00,00,000 కరెన్సీ నోట్లను కిటిలో నుంచి విసిరేశాడు. అదేదో నిజాయితీగా గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చితే ఎంతో పేరు వచ్చేది. ఇప్పుడంతా ఆయనను, ఛీ ఛీ పేదల పొట్ట కొట్టిన ఇతనేం మనిషి అంటూ చీదరించుకుంటున్నారు.