ద్రవిడ్‌ కెప్టెన్సీ ఇంకా నిర్ధారించలేదు : మాల్యా

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు సారథ్యాన్ని రాహుల్ ద్రవిడ్‌కు ఇవ్వనున్నట్లు సూచనప్రాయంగా చెప్పిన ఆ జట్టు ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యా ప్రస్తుతం మాట మార్చేశారు. ద్రవిడ్‌ను రాయల్ ఛాలెంజర్స్ సారధిగా ఇంకా నిర్ణయించలేదని ఆయన వెల్లడించారు. ఈ విషయం గురించి ద్రవిడ్‌తో మాట్లాడినప్పటికీ, కెప్టెన్సీ విషయం ఇంకా నిర్ణయించాల్సి ఉందని మాల్యా స్పష్టం చేశారు.

దీంతో... రాయల్ ఛాలెంజర్స్ జట్టులో కొనసాగుతున్న లుకలుకలు ఇప్పటికీ తగ్గలేదన్న వాదనలకు ఇది బలచేకూర్చేదిగా మారింది. దీనికి తోడు ఆ జట్టు ఫ్రాంఛైజీ విజయ్ మాల్యా ప్రకటనలు సైతం... విచిత్రంగా ఉండడం గుసగుసలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతోంది.

ద్రవిడ్ కెప్టెన్సీ విషయమై మాల్యా మీడియాతో మాట్లాడుతూ... తమ జట్టు కెప్టెన్సీ పగ్గాలను ఎవరికి కట్టబెట్టాలో ఇంకా నిర్ణయంచలేదని పేర్కొన్నారు. ఈ విషయమై తాను ద్రవిడ్‌తో మాట్లాడతాననీ, తను పరిణతి చెందిన వ్యక్తి కాబట్టి సమస్యను అర్థం చేసుకోగలడని మాల్యా వివరించారు.

ఇదిలా ఉంటే... ఇప్పటికే తన ఫ్రాంచైజీ జట్టుపై బాగా అసంతృప్తితో ఉన్న విజయ్ మాల్యా, కొద్దిరోజుల క్రితం... తన జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రాహుల్‌కు అప్పగించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలను చూసినట్లయితే.. రాహుల్‌ చేతికి పగ్గాలు దక్కడం మాటేమోగానీ, ఇంకెవరికి దక్కుతుందో కూడా తెలియని అయోమయం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి