ప్లీజ్ అమ్మా.. కేసు వాపస్ తీసుకో... కోడలికి వాట్సాప్ వీడియో కాల్ చేసి అభ్యర్థన

ఠాగూర్

బుధవారం, 9 అక్టోబరు 2024 (12:20 IST)
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన వెలుగుచూసింది. ఎనిమిది నెలల క్రితం వివాహమైన దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఆ వివాహిత భర్తతో పాటు అత్తామామలపై గృహహింస కేసు నమోదు చేశారు. దీంతో భయపడిపోయిన అత్తామామలు.. కోడలికి ఫోన్ చేసి.. అమ్మా.. కేసు వాపసు తీసుకో ప్లీజ్ అంటూ ప్రాధేయపడి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగోల్‌కు చెందిన పద్మావతి, భావనారాయణ దంపతుల ఏకైక కుమారుడు సుజన్. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు గత ఫిబ్రవరి 14వ తేదీన కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల భర్తతో పాటు అత్తామామలపై గృహహింస కేసు పెట్టింది. దీంతో తాము అరెస్టవుతామన్న భయం అత్తామామల్లో నెలకొంది. 
 
దీంతో ఈ నెల 5వ తేదీన ఇల్లు వదిలి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. బుకింగ్ ప్రకారం వారు మంగళవారం ఉదయం ఖాళీ చేయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి మరో తాళంతో గది తలుపులు తెరిచారు. అప్పటికే వారు ముగ్గురూ అపస్మారకస్థితిలోకి ఉన్నారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ముగ్గురిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. జ్యూస్‌లో అధిక మోతాదులో నిద్రమాత్రలు కలుపుకుని సేవించడంతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా తీసుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలావుంంటే, సోమవారం రాత్రి భావనారాయణ దంపతులు కోడలికి వాట్సాప్ వీడియో కాల్ చేసి.. కేసు వాపస్ తీసుకోవాలని బతిమిలాడినట్టు సమాచారం.
 
ఆమె అంగీకరించకపోవడం వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కోడలికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు