తెలంగాణాలో డబ్బు - నగలు తరలించాలంటే ఆధారాలు ఉండాల్సిందే..

మంగళవారం, 10 అక్టోబరు 2023 (10:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాలోకి భారీ మొత్తంలో డబ్బు, నగలు తరలించాలంటే సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, రూ.50 వేలకు పైగా నగదును తమ వెంట తీసుకుని వెళ్లేవారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో పోలీసుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసుల జరిపే తనిఖీల్లో పట్టుపడితే ఆ నగదు సరైన పత్రాలు చూపించవలసి ఉంటుంది. లేదంటే వాటిని సీజ్ చేస్తారు. 
 
ఎన్నికలు ముగిశాక వాటికి ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హాస్పిటల్ ఎమర్జెన్సీ, కాలేజీ ఫీజులు, బిజినెస్, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు, ఇతర అవసరాల నిమిత్తం నగదు తీసుకువెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. 
 
కాగా, తెలంగాణ వ్యాప్తంగా 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవారు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు పెద్ద ఎత్తున నగదు వంటివి తీసుకు వెళ్తే తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ నగదు తరలిస్తే కచ్చితంగా ఆధారాలు ఉంచుకోవాలి.
 
ముఖ్యంగా, ఆసుపత్రికి వెళ్లే అవసరమైతే రోగికి సంబంధించిన రిపోర్టులు, హాస్పిటల్ రిసీట్, ఇతర డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. వస్తువులు, ధాన్యం విక్రయం సొమ్ము, భూమికి సంబంధించిన నగదు వంటివి ఉంటే ఇందుకు సంబంధించి బిల్లులు దగ్గర ఉంచుకోవాలి. భారీగా నగదు దొరికితే జీఎస్టీ, ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు