తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : రాహుల్ గాంధీ బస్సు యాత్ర!

సోమవారం, 9 అక్టోబరు 2023 (10:34 IST)
తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మరో రెండు నెలల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులోభాగంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారు. 
 
ఈ నెల 19వ తేదీ నుంచి 21వతేదీ వరకు రాహుల్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అయితే, పర్యటన షెడ్యూల్ ఖరారు కావాల్సివుంది. ఈ బస్సు యాత్రలో రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 
 
సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొనేలా ఒప్పించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఈ నెల 10న హైదరాబాదులో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్‌పై స్పష్టత రానుంది. 
 
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 6 గ్యారెంటీలను ప్రకటించడం తెలిసిందే. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ తమ గ్యారెంటీలు విజయాన్ని అందిస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అయితే, ఆరు గ్యారెంటీలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఈ బస్సు యాత్రను చేపట్టాలని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు