మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'. తమిళ్ బ్లాక్ బస్టర్ చిత్రం 'కత్తి'కి రిమేక్ ఇది. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మెగా ఖైదీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం. పైగా.. తన కుమారుడు హీరో రాంచరణ్ నిర్మాతగా 'కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ'పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అయితే, ఇప్పుడీ చిత్రం గురించి ఓ ఆసక్తిరమైన విషయం బయటికొచ్చింది. దర్శకుడు వి.వి వినాయక్ కూడా మెగా ఖైదీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారట. కాస్త లేటుగా ఈ విషయం బయటికి పొక్కింది. అందుకే.. చరణ్ 'ధృవ' షూటింగ్లో బిజీగా ఉన్నా.. మెగా ఖైదీకి అన్నీ తానై అనుకొన్న టైంలో, అనుకొన్న బడ్జెట్లో పూర్తి చేసినట్టు ఫిల్మ్ నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
'ఖైదీ నెం.150' చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడు వినాయక్ సొంటింటిని అమ్మేశాడని వార్తలొచ్చాయి. వాస్తు సరిగ్గాలేకనే అమ్మేశాడని చెప్పుకొన్నారట. కానీ అసలు విషయం అదికాదని ఇప్పుడు అంటున్నారు. మెగా ఖైదీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు.. ఆ ఇంటిని విక్రయించినట్టు ఇపుడు తేటతెల్లమవుతోంది. అయితే, నిర్మాతగా వినాయక్ పేరు ఎక్కడా వినిపించకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలో ఎంత నిజముందనే విషయం మెగా ఫ్యామిలీనే నిర్ధారించాల్సి ఉంది.