ప్రజల దృష్టిని ఆకర్షించడానికి నటుల పేర్లు వాడుకోవద్దు.. మంచు విష్ణు వినతి

ఠాగూర్

గురువారం, 3 అక్టోబరు 2024 (10:35 IST)
సమాజంలో ఇటీవలికాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఇదే అంశంపై ఆయన గురువారం సుధీర్ఘ ప్రకటన విడుదల చేశారు. చిత్ర పరిశ్రమ, ఇతర రంగాలవలే, పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుందన్నారు. 
 
నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం, లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్దపు ఆరోపణలలోకి లాగబడటం ఇష్టం పడరు. అదేవిధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం అని అన్నారు.
 
నాయకులు, రాజకీయ నాయకులు, మరియు ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయ కధనాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు మరియు వారి కుటుంబాల పేర్లు వాడకండి. మేము, చిత్రపరిశ్రమలో పనిచేసేవారు, సమాజానికి వినోదం ఇవ్వడానికి మరియు సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగకూడదు అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
 
మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్దపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం.
 
పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతాం అని మంచు విష్ణు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు