"మిస్టర్ గిరీశం"ను ట్రైలర్లో వీక్షించండి

కృష్ణభగవాన్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "మిస్టర్ గిరీశం". ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై విశ్వప్రసాద్ దర్శకత్వంలో కె. రమేష్ చంద్ర బెనర్జీ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కథ గురించి చెబుతూ... "కన్యాశుల్కం"లోని గిరీశం పాత్రను మోడ్రనైజ్ చేసి తీస్తున్నామని, పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని విశ్వప్రసాద్ వెల్లడించారు. అందరూ పాత్రలకు తగ్గట్టు చక్కగా అమరారని, చిత్ర యూనిట్‌కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మధురవాణి పాత్రలో రమ్యకృష్ణ నటించడం చిత్రానికి హైలైట్‌ అవుతుందని నిర్మాత వెల్లడించారు. మ్యూజిక్ పరంగా మంచి చిత్రమవుతుందని ఆయన వెల్లడించారు. ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, అడుగడుగునా ఈ చిత్రం ఆలోచింప జేస్తుందని నిర్మాత చెప్పారు. మన సమాజంలో ఒకప్పుడున్న కన్యాశుల్కం మరలా వచ్చే పరిస్థితులున్నాయా? వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన చర్చ కూడా ఇందులో కనిపిస్తుందని బెనర్జీ బాబు వివరించారు.

కృష్ణభగవాన్ మాట్లాడుతూ.. గురజాడ కన్యాశుల్కంలోని గిరీశం పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. రమ్యకృష్ణతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దర్శకుడు ఎక్కడా రాజీపడకుండా చక్కగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో సైరాభాను, క్రిషి, జయప్రకాష్ రెడ్డి, జీవా, సందేశ్, అపూర్వ, బాలాజీ, రామ్‌జగన్, పద్మాజయంతి తదితరులు నటిస్తున్నారు. మాటలు... కొర్నిపాటి వేణుభార్గవ్, కెమెరా... రాజేష్ కాట, సంగీతం... ఎస్.ఎ. ఖుద్దూస్, ఎడిటింగ్... అనిరుద్రారెడ్డి, దర్శకత్వం... విశ్వప్రసాద్.

వెబ్దునియా పై చదవండి