ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సకల జనుల సమ్మె చేపట్టి నేటికి సరిగ్గా యేడాది. మొత్తం 42 రోజుల పాటు ఉద్విగ్నభరితంగా సాగిన ఈ పోరాటం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నేతృత్వంలో ఈ మహోన్నత పోరాటం ఏక బిగువున సాగింది.
రాజ్యాంగబద్ధమైన కోరికతో, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా.. మన వనరులు మనక్కావాలని.. మన ఉద్యోగాలు మనక్కావాలని... మన భాష, మన యాసను కాపాడుకోవాలని... మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని.. అంతిమంగా సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి పొందేందుకు చేపట్టిన పోరాటమే ఈ సకల జనుల సమ్మె.
ఇందులో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసిన పోరాటం. అందరి నోటా ఒకే మాట... 'జై తెలంగాణ.. జై జై తెలంగాణ'! ఇదే నినాదం 42 రోజుల పాటు తెలంగాణ గడ్డపై ఉన్న పది జిల్లాలు మర్మోగిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం.. సెప్టెంబర్ 12వ తేదీన కన్నారం పోరుగడ్డ మీద.. 'తెలంగాణ జన గర్జన' వేదికగా 'సకల జనుల సమ్మె' సమరశంఖం మోగింది.
తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కే.చంద్రశేఖర్ రావు పిలుపునకు స్పందించిన అన్ని తెలంగాణ ఉద్యమ, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఈ సమ్మెకు శ్రీకారు చుట్టారు. ఇందులో యావత్ తెలంగాణ కదం తొక్కింది. పాలు పంచుకుంది. ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. పరిపాలన ఆటకెక్కింది. అన్ని వర్గాల మద్దతుతో 42 రోజుల పాటు ఏకబిగువున సాగిన ఈ మహోద్యమాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది.