గులాబ్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షలు: జగన్

మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:19 IST)
గులాబ్‌ తుపాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డ బాధితులకు రూ. 1000, సహాయ శిబిరాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే బాధితులకూ రూ.1000 తక్షణమే ఇవ్వాలని చెప్పారు. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలని నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. పంట నష్ట పరిహారాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం నుంచి సిఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను సిఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని చెప్పారు.

అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయని వాటిని తొలగించామని అన్నారు. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహయ కార్యక్రమాలు ముమ్మరం చేశామని లోతట్టు ప్రాంతాల్లోని వారిని శిబిరాలకు తరలించామని చెప్పారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి మంత్రి బొత్స, శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్‌ పాల్గొని తుపాను పరిస్థితులను సిఎంకు వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు