నెల్లూరు జిల్లా కనిగిరి మండలం పాతపాడుకు చెందిన రమణమ్మ, వెంకటేశ్వర్లు రెండో కుమార్తె మార్తాల సుమలత (28)ను అదే గ్రామానికి చెందిన రవీంద్రబాబు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరు నెల్లూరులోని చలపతినగర్లో జీవిస్తున్నారు. వీరికి పవన్ (8) మదన్ (5) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రవీంద్ర బాబు పలు రకాల వ్యాపారం చేస్తూ ఆర్థికంగా స్ధిర పడ్డారు.
ఈ క్రమంలో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 2012లో మొలల ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించడంతో రవీంద్రబాబు మృతి చెందాడు. దీంతో రవీంద్రబాబు సోదరుడు శ్రీకాంత్ నాలుగేళ్ల క్రితం వదిన సుమలతను వివాహం చేసుకున్నాడు. శ్రీకాంత్ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఓ హోటల్ నిర్వహిస్తుండగా శ్రీకాంత్ కూడా ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ భార్య వద్దకు వచ్చి వెళుతుండేవాడు.
ఈ పరిస్థితుల్లో తన భార్య స్థానికంగా ఉండే ఓ ఆటోడ్రైవర్తో చనువుగా ఉంటుందన్న అనుమానం అతనిలో పడింది. దీంతో ఆమెతో తరచూ గొడవపడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నెల్లూరుకు వచ్చిన శ్రీకాంత్ ఈ విషయమై భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ సమస్యను ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి చర్చించుకుని పరిష్కరిస్తామని మరో రెండురోజుల్లో వస్తామని చెప్పినట్లు తెలిసింది.
అయితే ఇదే విషయమై సోమవారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరగడంతో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను అంగడికి పంపించి.. ఆమెను రోకలిబండతో కొట్టి అనంతరం మృత దేహాన్ని బాత్రూమ్లో వేసి పెట్రోలు పోసి నిప్పంటిచినట్లు స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడన్న అనుమానంతో కొందరు స్థానికులు ఐదోనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.